అమరావతి : టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను ఏపీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించాలని చూస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. “విద్యార్థుల భవిష్యత్ కోసమే రాష్ట ప్రభుత్వం ఆలోచిస్తున్నది. విపత్కర పరిస్థితుల్లోనూ విపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదు. కరోనా తీవ్రతను బట్టి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించింది.
పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని ప్రతిపక్షాలు గ్రహించాలి అని” సీఎం జగన్ అన్నారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు.
టెన్త్, ఇంటర్లపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్కే నష్టమని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్ గురించి తన కంటే ఎక్కువగా ఆలోచించే వారు ఎవరూ లేరని అన్నారు. కొవిడ్పై పోరాటంలో కచ్చితంగా గెలుస్తామని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి