ముంబై, ఏప్రిల్ 9: రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. డాలర్తో పోల్చితే వరుస నష్టాలతో మరింతగా బక్కచిక్కుతున్నది. శుక్రవారం మరో 15 పైసలు దిగజారి 74.73 స్థాయికి క్షీణించింది. ఇది నవంబర్ 4, 2019 నాటి స్థాయి కావడం గమనార్హం. అంతకుముందు నాలుగు సెషన్లలోనూ దేశీయ కరెన్సీ నీరసించింది. దీంతో గడిచిన ఐదు రోజుల్లో రూపాయి నష్టాలు 161 పైసలకు చేరాయి. బుధవారం ఒక్కరోజే 105 పైసలు పతనం కావడం గమనార్హం.
ఎందుకీ పరిస్థితి?
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణత వెనుక దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, స్టాక్ మార్కెట్ల నష్టాలు, డాలర్పట్ల మదుపరుల మక్కువ ప్రధానంగా కనిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ పాలసీలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతుండటం కూడా రూపాయిని ఒత్తిడిలోకి నెడుతున్నదని ఫారెక్స్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇంధన ధరలు పైపైకి?
రూపాయి పతనం.. దేశీయ దిగుమతులను భారం చేస్తుంది. ముఖ్యంగా ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదమున్నది. దేశీయ చమురు అవసరాల్లో 80% దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి మరి. అలాగే ద్రవ్యోల్బణానికీ దారి తీయవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆయా వస్తూత్పత్తుల ముడి సరుకుల దిగుమతులు ప్రియం కావడమే ఇందుకు కారణం. మరోవైపు ఐటీ ఎగుమతులకు రూపాయి క్షీణత కలిసి వస్తుంది.