2020-21 ఆర్థిక సంవత్సరంలో 11,538 నిర్మాణ అనుమతుల ద్వారా జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ విభాగానికి రూ.797.13 కోట్ల ఆదాయం వచ్చిందని శనివారం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో 67 హైరైజ్డ్ భవనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు 1574 అక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా రియల్ ఎస్టేట్ రంగాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం గత జులై నుంచి భవన నిర్మాణ అనుమతుల ఫీజుల్ని నాలుగు సమాన వాయిదాల్లో చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. అనుమతి పొందగానే ఒక వాయిదా, మిగతా మూడు వాయిదాలు ఆర్థిక సంవత్సరం ( ఈ ఏడాది మార్చి 31) ముగిసేలోగా చెల్లించేలా అవకాశం కల్పించిందన్నారు. మొత్తం ఒకేసారి చెల్లించిన వారికి 5 శాతం రాయితీ కల్పించామని అధికారులు వివరించారు. ఈ వాయిదాల చెల్లింపుల అవకాశాన్ని బిల్డర్లు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. కాగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 17 వేల అనుమతుల ద్వారా రూ.957కోట్లు ఆదాయం వస్తే, 2020-21 ఆర్థిక సంవత్సరంలో భవన నిర్మాణాలపై కరోనా ప్రభావం తాత్కాలికంగా పడింది.