న్యూఢిల్లీ, ఆగస్టు 20: హురున్ గ్లోబల్ టాప్-500 విలువైన సంస్థల జాబితాలో ఈ ఏడాది 12 భారతీయ కంపెనీలకు చోటు దక్కింది. దేశీయంగా వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అగ్రస్థానంలో ఉండగా, 188 బిలియన్ డాలర్ల(రూ.14 లక్షల కోట్ల)తో మొత్తం జాబితాలో 57వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే కంపెనీ విలువ 11 శాతం పెరిగింది. ఇక ఆర్ఐఎల్ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 164 బిలియన్ డాలర్లతో ఉన్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 113 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో స్థిరపడింది. ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎయిర్టెల్, కొటక్ మహీంద్రా విలువ నిరుడుతో చూస్తే ఈసారి తగ్గుముఖం పట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్ విలువ 36 శాతం పెరిగింది. ఇదిలావుంటే జాబితాలో 12 సంస్థలతో భారత్.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి 9వ స్థానంలో నిలిచింది.