Decade Low Interest | ఫెస్టివల్ సీజన్.. కరోనా మహమ్మారి వెలుగు చూశాక సొంతింటికి పెరిగిన ప్రాధాన్యం.. ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు తక్కువ వడ్డీరేట్లపై బ్యాంకులు.. ఒక్కమాటలో చెప్పాలంటే పదేండ్ల నాటి వడ్డీరేట్లకే ఇంటి రుణాలిస్తున్నాయి. ఇక బిల్డర్లు కూడా డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నారు. పండుగల సీజన్ సాగే మూడు నెలల పాటు సొంతిండ్ల కొనుగోలుదారులు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఇండ్ల రుణాల కోసం పోటెత్తనున్నారు.
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐతోపాటు హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ), కొటక్ మహింద్రా బ్యాంక్ వరకు దాదాపు అన్ని బ్యాంకులు ఇండ్ల రుణాలపై ఇప్పటివరకు అమలు చేసిన వడ్డీరేట్లలో 15-60 బేసిక్ పాయింట్లు కోత విధించనున్నాయి. అంటే 6.5-6.7 శాతం వడ్డీరేటుకే ఇండ్ల రుణాలు లభించపోతున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మాఫీచేస్తున్నాయి బ్యాంకులు.
వడ్డీరేట్లు తగ్గడంతోపాటు వృద్ధిరేటును ప్రోత్సహించేందుకు బ్యాంకులకు ఆర్బీఐ భారీగా నిధుల పంపిణీ చేసింది. ఇక బిల్డర్లు కొనుగోలుదారులకు డిస్కౌంట్లు, గిఫ్ట్లు ఆఫర్ చేస్తున్నారు. పేమెంట్స్ వాయిదా ప్లాన్స్ను అనుమతినిస్తున్నారు.
పండుగల సీజన్లో ప్రతి కుటుంబం తమ ఇంట్లోకి కన్జూమర్ డ్యూరబుల్ వస్తువులు మొదలు టూ వీలర్స్, కార్లు కొనుగోలు చేస్తారు. ఇప్పటికే వాల్మార్ట్-ఫ్లిప్కార్ట్, అమెజాన్ యూజర్లకు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించాయి. ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ సేల్స్లో ఎలక్ట్రానిక్ గూడ్స్పై 80 % వరకు రాయితీ ఇస్తోంది.
ఫెస్టివ్ సీజన్ ఆఫర్లతోపాటు తక్కువ వడ్డీరేట్లు.. స్థిరమైన ఇండ్ల ధరలతో ఇండ్ల కొనుగోళ్లు పెరుగుతాయని జోనెస్ లాంగ్ లాసల్లే రీసెర్చ్ సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ సమంతక్ దాస్ చెప్పారు. దేశంలోని ఆరు ప్రధాన నగరాల వాసుల్లో 80 శాతానికి పైగా వచ్చే మూడు నెలల్లో సొంతిండ్లు కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తామన్నారని జేఎల్ఎల్ సర్వేలో తేలింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ మాత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఇండ్ల సేల్స్ పుంజుకుంటాయని వ్యాఖ్యానించింది.