న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: రక్షణ రంగానికి కీలక ఉత్పత్తులను అందించే మిశ్ర ధాతు నిగమ్ (మిథాని) లిమిటెడ్లో కేంద్ర ప్రభుత్వం 10 శాతం వాటా విక్రయించే ప్రక్రియను చురుగ్గా అమలుజరుపుతోంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యలాపాలు నిర్వహిస్తున్న మిథాని డిజిన్వెస్ట్మెంట్పై రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ సమీక్షించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రక్షణ, అంతరిక్ష, విద్యుత్ రంగాల్లో ఉపయోగించే స్పెషాలిటీ స్టీల్స్ను మిథాని ఉత్పత్తి చేస్తుంది. ఇండియాలో టైటానియం అల్లాయిస్ను తయారుచేసే కంపెనీ ఇదొక్కటే. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (ఒఎఫ్బీ), డీఆర్డీవో, ఇస్రో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఆణువిద్యుత్ శాఖలకు ఈ కంపెనీ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఈ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 74 శాతం వాటా వుంది. కొన్ని కంపెనీలను పూర్తిగా విక్రయించడం, మరికొన్ని కంపెనీల్లో పాక్షికవాటా విక్రయించడం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈ డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికలో భాగంగా మిథానితో పాటు బీపీసీఎల్, బీఈఎంఎల్, గార్డెన్రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వాటా విక్రయంపై రాజ్నాథ్ సింగ్తో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష జరుపుతారని అధికార వర్గాలు వెల్లడించాయి.