న్యూఢిల్లీ, అక్టోబర్ 14: కొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్న సెన్సెక్స్ గురువారం తొలిసారిగా 61,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. దేశీయ అనుకూల ఆర్థిక గణాంకాల కారణంగా ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరపడంతో సెన్సెక్స్ మరో 569 పాయింట్లు పెరిగి చారిత్రాత్మక గరిష్ఠస్థాయి 61,353 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచి 177 పాయింట్లు ర్యాలీ జరిపి 18,339 పాయింట్ల రికార్డుస్థాయి వద్ద నిలిచింది. స్టాక్ సూచీలు వరుసగా ర్యాలీ జరపడం ఇది ఆరో రోజు. ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,116 పాయింట్లు, నిఫ్టీ 692 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. ఈ ఆరు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ. 10 లక్షల కోట్ల మేర పెరిగింది.
ఈ షేర్లు ఆల్టైమ్ రికార్డు
పలు బ్లూచిప్ షేర్లు తాజాగా కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. బుధవారం ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ట్రేడింగ్ ప్రారంభంలో 5 శాతం వరకూ ర్యాలీ జరిపి రూ.1,783 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది. అలాగే విప్రో 10 శాతంపైగా పెరిగి రూ.739 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్యూమినియం కంపెనీ హిందాల్కో, ఇన్ఫ్రా దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో, ఆభరణాల కంపెనీ టైటాన్, రైల్వే టూరిజం కంపెనీ ఐఆర్సీటీసీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
నేడు మార్కెట్కు సెలవు
దసరా దసరా పండుగ సందర్భంగా శుక్రవారం స్టాక్ ఎక్సేంజీలకు సెలవు. తిరిగి సోమవారం ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.