న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్కార్ట్ విస్తరణ బాట పట్టింది. హైదరాబాద్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్లు బుధవారం ప్రకటించింది. నైపుణ్యం, ప్రతిభ కలిగిన యువతకు పెద్దపీట వేస్తామంటున్న సంస్థ.. హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వచ్చే ఏడాది మార్చికల్లా 2వేలకుపైగా నియామకాలు చేపట్టే యోచనలో ఉన్న ట్లు స్పష్టం చేసింది. అలాగే సింగపూర్, పశ్చిమాసియా, అమెరికాల్లోనూ 300లకుపైగా మందిని తీసుకోనున్నట్లు తెలిపింది. టెక్నాలజీ, డాటా సైంటిస్టులు, డాటా ఇంజినీర్లు, వ్యాపార విశ్లేషకులు, నిపుణులను పెద్ద ఎత్తున కొలువుల్లోకి తీసుకోవాలనుకుంటున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. శరవేగంగా పెరుగుతున్న స్టోర్ల నిర్వహణ కోసం హైదరాబాద్, ఎన్సీఆర్, బెంగళూరుల్లో 1,500లకుపైగా రిటైల్ ఉద్యోగుల్ని, 100కుపైగా ఇంజనీర్లను నియమించుకోనున్నది. అలాగే 300లకుపైగా ఉద్యోగుల్ని సరఫరా, తయారీ కార్యకలాపాల కోసం, మరో 100 మందిని ఫైనాన్స్, కన్జ్యూమర్ ఇన్సైట్స్, మానవ వనరులు, మర్చండైజింగ్ తదితర కార్పొరేట్ అవసరాల కోసం ఉద్యోగాల్లోకి సంస్థ తీసుకోనున్నది.
ప్రాంతీయ మార్కెట్లలో బలోపేతం కావడంపై దృష్టి పెట్టినట్లు ఈ సందర్భంగా లెన్స్కార్ట్ వ్యవస్థాపక సీఈవో పీయూష్ బన్సల్ తెలిపారు. అందుకే స్టోర్లను పెంచుతున్నామని, ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్ విక్రయాలనూ సాగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం భారత్తోపాటు అంతర్జాతీయంగా సంస్థ వృద్ధిపథంలో ముందుకెళ్తున్నదన్నారు. ‘సంస్థ వృద్ధిలో నియామకాలు ప్రధానమైన అంశం. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ప్రతిభావంతులను ఉద్యోగాల్లోకి తీసుకుంటాం’ అని బన్సల్ తెలియజేశారు. ప్రస్తుతం సంస్థలో 5వేలకుపైగా ఉద్యోగులుండగా, ఇందులో 200లకుపైగా ఇంజనీర్లు, డాటా సైంటిస్టులు, ప్రోడక్ట్ డిజైనర్లున్నారు.
గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా.. రాబోయే ఐదేండ్లలో రూ.1,600 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. అలాగే అదనంగా 10వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని బుధవారం తెలిపింది. ‘ది న్యూ ఈక్వేషన్’ పేరిట తమ కొత్త వ్యాపార వ్యూహాన్ని పీడబ్ల్యూసీ ఇండియా తాజాగా ప్రకటించింది. క్యాంపస్ నియామకాలను పెంచుతామని ఇందులో పేర్కొన్నది. కాగా, క్లయింట్లు, భాగస్వాముల అభిప్రాయాలు, చర్చలతోపాటు ప్రస్తుత ట్రెండ్స్పై విశ్లేషణ ఆధారంగా ఈ నూతన వ్యాపార వ్యూహాన్ని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం దేశీయంగా సంస్థలో దాదాపు 15వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పీడబ్ల్యూసీకి మొత్తం 2,84,000 మంది ఉద్యోగులున్నారు.