హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): వ్యవసాయానికి సాంకేతిక దన్నుగా నిలిచేంందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసిన అగ్రిహబ్ను సోమవారం మంత్రి కేటీఆర్ అగ్రిహబ్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వ సూచనలతో టీ హబ్ను ఆదర్శంగా తీసుకొని పలుస్టార్టప్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని అగ్రిహబ్కు వ్యవసాయ వర్సిటీ రూపకల్పన చేసింది. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. వ్యవసాయానికి సాంకేతికతోడ్పాటు అందించేందుకు 21 స్టార్టప్లను గుర్తించిన ఐటీశాఖ, యూనివర్సిటీ 11 స్టార్టప్లకు ఆమోదం తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికను వ్యవసాయరంగంలో ఈ స్టార్టప్ల సాయంతో వినియోగించనున్నారు. డ్రోన్లద్వారా ఎరువుల పిచికారి, రోబోటిక్ విధానంలో కలుపు తీయడం, ఏఐ, డ్రోన్ల ద్వారా తెగుళ్ల గుర్తింపు, నీటిపారుదల యాజమన్యంపై పనిచేయనున్నారు. అగ్రిహబ్ నిర్మాణానికి నాబార్డ్ ఆర్థికంగా అండగా నిలిచింది. కేవలం ఏడు నెలల్లోనే అగ్రిహబ్ నిర్మాణం పూర్తయ్యింది.