న్యూఢిల్లీ, జూలై 21: భారత్లో అత్యంత విలువైన ఇంటెర్నెట్ కంపెనీ బైజూస్&అమెరికాకు చెందిన రీడింగ్ ప్లాట్ఫామ్ ఎపిక్ను 500 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 3,700 కోట్లు) టేకోవర్ చేసింది. ఇతర దేశాలకు భారీగా విస్తరించే ప్రణాళికలో భాగంగా బైజూస్ తాజా టేకోవర్ జరిపింది. స్కూలు విద్యార్థుల్లో పఠనాసక్తిని కల్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా 250 ఉత్తమ ప్రచురణకర్తల నుంచి 40,000 పుస్తకాలు ఎపిక్ ప్లాట్ఫామ్లో లభ్యమవుతాయి. దాదాపు ప్రతీ అమెరికా ప్రాథమిక పాఠశాలలోనూ ఎపిక్ ప్లాట్ఫామ్ను ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. తాజా టేకోవర్కు సంబంధించి ఎపిక్ ప్రమోటర్లకు నగదు, స్టాక్ రూపాల్లో ఎంత శాతం చెల్లించేదీ వెల్లడి కాలేదు. అంతర్జాతీయంగా బాలబాలికల్లో ఇంటరాక్టివ్ రీడింగ్, లెర్నింగ్ పెంపొందించడానికి ఎపిక్తో తమ భాగస్వామ్యం తోడ్పడుతుందని బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఎపిక్ ప్రస్తుత సీఈవో, సహవ్యవస్థాపకుడైన సురేన్ మార్కోసియనే ఇకముందు కూడా ఆ కంపెనీ నిర్వహణా బాధ్యతలు చూస్తారు. ఉత్తర అమెరికాలో బిలియన్ డాలర్లు పెట్టుబడి చేయనున్నట్లు ఈ సందర్భంగా బైజూస్ ప్రకటించింది.
అమెరికాలో బైజూస్ టేకోవర్ ఇదే మొదటిది కాదు. 2019లో ఎడ్యుకేషనల్ గేమ్స్ స్టార్టప్ వోస్మోను 120 బిలియన్ డాలర్లకు కొన్న బైజూస్.. గతేడాది కోడింగ్ స్టార్టప్ వైట్హ్యాట్ జూనియర్ను చేజిక్కించుకుంది. అలాగే గత నెలలో మ్యాథ్స్, కోడింగ్కు సంబంధించిన లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఫ్యూచర్ స్కూల్ను బైజూస్ ప్రారంభించింది. ఇవే కాకుండా గతేడాది దేశీయంగా, అంతర్జాతీయంగా బైజూస్ 2 బిలియన్ డాలర్ల విలువైన టేకోవర్లు జరిపింది. ఈ కొనుగోళ్ల పరంపర కారణంగా బైజూస్ను 16.5 బిలియన్ డాలర్ల (రూ.1,23,000 కోట్లు) కంపెనీగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు విలువ కట్టాయి.