న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. 2003లో చౌక ధరకే మొబైల్ ఫోన్ అందుబాటులోకి తెచ్చింది.. పుష్కర కాలం తర్వాత 4జీ తో టెలికం రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.. చౌక ధరకే ఇంటర్నెట్, ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చిన రిలయన్స్ జియో దేశీయ టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. రిలయన్స్ తెచ్చిన ఈ మార్పుతో సామాన్యుడికి కూడా ఇంటర్నెట్ తక్కువ ధరకే లభిస్తున్నది. తక్కువ కాలంలోనే దేశీయ టెలికం ప్రొవైడర్లలో టాప్ పొజిషన్కు చేరుకున్నది.
టెలికం రంగంతోపాటు రిటైల్, ఈ-కామర్స్ రంగంలోకి దూకుడుగా దూసుకెళ్తున్నది రిలయన్స్ జియో. ఇక తక్కువ ధరకే ల్యాప్టాప్లనూ రిలయన్స్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని కొన్నాళ్ల క్రితం వచ్చిన వార్తలు నిజం కానున్నాయని సమాచారం. ‘జియో బుక్’ పేరుతో ల్యాప్టాప్ల తయారీ ప్రారంభించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే రెండు నెలల్లో అంటే వచ్చే మే నెలలో జియో బుక్ ల్యాప్ టాప్ విపణిలోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. అంతా ఊహించినట్లు విపణిలోకి జియోబుక్ లాప్టాప్ ప్రవేశిస్తే.. మొత్తం మార్కెట్నే షేక్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.
ల్యాప్టాప్ తయారీ ఖర్చులను తగ్గించేందుకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ను జియో ఉపయోగిస్తున్నదని వినికిడి. ఇది 11 నానో మీటర్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఇప్పటికే పలు మొబైల్ ఫోన్లలో ఈ చిప్ను వినియోగిస్తున్నారు. దీనిలో ఇన్-బిల్ట్ 4జీ ఎల్టీఈ మోడెమ్ ఉంటుంది. ఇందులో వీడియోల కోసం మినీ హెచ్డీఎంఐ, 5 గిగా హెడ్జ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్, 3 యాక్సిస్ యాక్సెలెరోమీటర్, క్వాల్కామ్ ఆడియో చిప్లను వినియోగించనున్నారు.
ఈ ల్యాప్టాప్లో జియో స్టోర్, జియో మీట్, జియో పేజెస్, జియో యాడ్ సర్వీసులను ముందుగానే లోడ్ చేసి ఉంచుతారని సమాచారం. ఈ ల్యాపీ ధర మీద ఇంకా ఎలాంటి సమాచారం లేదు. మొబైల్ ఫోన్స్ను తక్కువ ధరకే అందిస్తున్నది జియో. అదే బాటలో ఇప్పుడు ల్యాప్టాప్లను కూడా తక్కువ ధరలోనే తీసుకొస్తుందని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సెల్యులార్ కనెక్షన్తో పనిచేసే ల్యాప్టాప్ల తయారీపైనే జియో ఆసక్తి చూపుతుందని అమెరికా క్వాల్కామ్ టెక్నాలజీస్ సీనియర్ ప్రొడక్ట్ డైరక్టర్ మిగ్యుల్ న్యూన్స్ మూడేండ్ల క్రితం 2018లో తెలిపారు. ఆ తర్వాత సుమారు మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. సాధారణ ల్యాప్టాప్ల మాదిరిగా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో కాక, గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్తో ఇవి పని చేయడం ఆసక్తికర పరిణామం. ఆండ్రాయిడ్ ఓఎస్లో కొన్ని మార్పులు చేసి ఈ ల్యాప్టాప్ల్లో వాడనున్నారు. దీనిని జియో ఓఎస్ అని పిలుస్తారని సమాచారం.