న్యూఢిల్లీ: క్యాబ్స్ అగ్రిగేటర్ ఓలా అనుబంధ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ.. ఓలా ఎలక్ట్రిక్ తొలిసారి మార్కెట్లోకి తీసుకొస్తున్న ఎలక్ట్రిక్- స్కూటర్కు కస్టమర్ల నుంచి ఊహించని రీతిలో స్పందన లభిస్తుంది. బుకింగ్స్ ప్రారంభించిన 24 గంటల్లో లక్షకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. ఈ సంగతిని సంస్థ సీఈవో భావిష్ అగర్వాల్ శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం బద్దలైంది. లక్ష మందికి పైగా కస్టమర్లు ఈ-స్కూటర్ కోసం తమ పేర్లు రిజర్వు చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్స్ గురువారం నుంచి మొదలైన సంగతి తెలిసిందే. సంస్థ వెబ్సైట్లో రూ.499 చెల్లించి స్కూటర్ను బుక్ చేసుకోవచ్చు.
ఈ నెలాఖరులో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విపణిలోకి అడుగు పెడుతుందని భావిస్తున్నారు. నూతన స్కూటర్ యాప్ బేస్డ్ కీతో నడువనున్నది. ఇక ఇప్పటి వరకు ఇగ్నిషన్ కీతో బైక్లు, స్కూటర్లు, కార్లు నడిచేవి. కానీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం యాప్ ఆధారిత కీతో నడువనున్నది.
భారతదేశ వ్యాప్తంగా తొలి ఎలక్ట్రిక్ వాహనం కోసం కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నది. దీంతో తాను థ్రిల్ అయ్యాయనని భావిష్ అగర్వాల్ తెలిపారు. భారతీయులు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పడానికి ఇది స్పష్టమైన సంకేతం అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈవీ విప్లవంలో భాగస్వాములవుతున్న వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు.