ప్రస్తుతం మార్కెట్లో చర్మ సంరక్షణ, నిగారింపు కోసం రకరకాల క్రీములు, లోషన్లు అందుబాటులో ఉన్నాయి. మరి అమ్మమ్మలు, నానమ్మల కాలంలో చర్మం అంత ఆరోగ్యంగా ఎలా ఉండేదంటారా? మట్టి స్నానమే వాళ్ల మేనికాంతి రహస్యం. ముల్తానీ మట్టి, పసుపు, రోజ్ పౌడర్, నారింజ తొక్క పొడి, గంధపు పొడి.. ఇలా సహజసిద్ధమైన పదార్థాలనే వారు ఉపయోగించారు. ముఖ్యంగా ముల్తానీమట్టి సుగుణాలపై అనుమానమే అవసరం లేదు. ఇది హానికర నూనెలను గ్రహించి, మొటిమలను దూరం చేస్తుంది. ముఖంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. వాడకమూ తేలికే. ముల్తానీ
మట్టిలో కొన్ని నీళ్లు పోసి పేస్ట్లా చేయాలి. దాన్ని ముఖంపై, మెడపై రాసుకొని, పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆపైన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్ పూయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే, చర్మ సమస్యలు తగ్గుతాయి. ముల్తానీమట్టిలో నారింజ తొక్క పొడి, పసుపు, గంధపు పొడి కూడా కలుపుకోవచ్చు.