న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో కొత్త ఆంక్షలు విధించింది. కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లినా.. ఆ వ్యక్తి కచ్చితంగా మాస్క్ను ధరించాలని తాజా ఆదేశాల్లో పేర్కొన్నది. మాస్క్ అనేది సురక్షా కవచంగా పనిచేస్తుందని, అది కోవిడ్ వ్యాప్తిని అడ్డుకుంటుందని కోర్టు అభిప్రాయపడింది. ఒంటరిగా ప్రైవేటు కారుల్లో వెళ్తున్న వారిపై జరిమానా విధించడాన్ని రద్దు చేయాలని దాఖలైన నాలుగు పిటిషన్లను కోర్టు కొట్టిపారేసింది. కారులో ఒక్క ప్రయాణికుడు ఉన్నా.. అది పబ్లిక్ స్పేస్ అవుతుందని కోర్టు తన తీర్పులో చెప్పింది.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. పాజిటివ్ కేసులు ఇవాళ అత్యధికంగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో లక్షా 15 వేల పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. గత మూడు రోజుల్లో రెండు సార్లు కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటడం శోచనీయం. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్నా.. మరోవైపు మాత్రం పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.