మానకొండూర్, జూన్ 5: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మానకొండూర్ సీఐ వై కృష్ణారెడ్డి సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీసువిధ గ్రీనరీ అసోసియేట్స్ వారు ఉచితంగా అందజేసిన మొక్కలను శనివారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బంది, విలేకరులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు శ్రీసువిధ అసోసియేట్స్ సభ్యులు ఉచితంగా మొక్కలను అందజేయడం అభినందనీయమని కొనియాడారు. కరీంనగర్ ఎస్బీ సీఐ బూర్గుల సంతోష్కుమార్, ట్రైనీ ఎస్ఐ అక్రమ్, శ్రీసువిధ గ్రీనరీ అసోసియేట్స్ అధినేత రాజ్కుమార్, పోలీస్ సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
మానకొండూర్ రూరల్, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా వన్నారంలో శనివారం సర్పంచ్ పొలాడి కవిత ఆధ్వర్యంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ మొక్కలకు ఇటీవల గ్రామంలో పొగుచేసిన తడి, పొడి చెత్తను వర్మి కంపోస్ట్గా వేశారు. మిగిలిన ఎరువును పల్లె ప్రకృతివనంలో భాగంగా నాటిన మొక్కలకు వేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ ప్రతినిధి రమేశ్ పర్యావరణాన్ని పరిరక్షించకపోతే వచ్చే నష్టాలను వివరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఈజీఎస్ పనులను చేపట్టారు. కార్యక్రమంలో ప్రతిమ ఫౌండేషన్ మేనేజర్ వంగ గీతారెడ్డి, ఎంపీవో ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
పర్యవరణాన్ని కాపాడుకోవాలి
తిమ్మాపూర్ రూరల్, జూన్ 5: ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనిత, వైస్ చైర్మన్ గుజ్జుల రవీందర్రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా కరీంనగర్లోని మార్కెట్ యార్డ్ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మండలంలోని లక్ష్మీదేవిపల్లిలో సర్పంచ్ కరివేద పద్మజ మొక్కలు నాటారు. నర్సరీలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడుకోవాలి
సైదాపూర్, జూన్ 5: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని యూనిసెఫ్ క్లస్టర్ ఫెసిలిటేటర్ చెన్నబోయిన రవీందర్ అన్నారు. సర్వాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శివరాంపల్లిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని యూనిసెఫ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లెపకృతివనంలో మొక్కలు నాటారు. ఎంపీటీసీ జెల్ల మల్లేశ్, కార్యదర్శి రాజు, కేడీవీఎస్ సభ్యురాలు దీప్తి, వలంటరీ సభ్యుడు మండల జంపయ్య, అంగన్వాడీ టీచర్ స్వప్న, ఆశ కార్యకర్తలు ఉన్నారు.
విరివిగా మొక్కలు నాటాలి
హుజూరాబాద్టౌన్, జూన్ 5: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, అంగన్వాడీ టీచర్ కోటోజు జ్యోతిరాణి, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, హుజూరాబాద్ సింగిల్విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్రెడ్డి పేర్కొన్నారు. శనివారం హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయ ఆవరణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తులసి, తిప్పతీగ, మునగ, రావి, వేప తదితర ఆయుర్వేద మొక్కలు నాటారు. కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డి, ఏఎస్పీ రతీకకు పలు రకాల ఆయుర్వేద మొక్కలు అందజేశారు. కౌన్సిలర్లు తాళ్లపెల్లి శ్రీనివాస్గౌడ్, మెరుగు కొండల్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పంజాల కుమారస్వామి, పోతరవేణి అనిల్యాదవ్, సామల రాజారెడ్డి, ఎండీ రియాజ్, సబ్బని రమేశ్, గందె సాయిచరణ్, నిమ్మ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.