శామీర్పేట : జాయింట్ సర్వేకు రైతులంతా సహకరించాలని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్ కోరారు. మూడు చింతల్పల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామ సర్వే, నక్ష ఏర్పాటు విషయంపై మంగళవారం గ్రామ రైతులు, పంచాయతీ పాలకవర్గంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్వహించిన సర్వేను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. గతంలో నిర్వహించిన సర్వే తర్వాత రైతులకు కొన్ని ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందేనని, అయితే, గ్రామంలో ఇప్పటి వరకు మంజూరైన 300 పట్టాదార్ పాస్ పుస్తకాల్లో సర్వే నెంబర్లు, భూమి వివరాలను సరి చేయడానికి జాయింట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆరుగురు రెవెన్యూ అధికారులు, సరేయర్లు ఆరుగురు, అడిషనల్ కలెక్టర్ పర్యవేక్షణలో డోర్ టూ డోర్ ప్రొఫార్మర్తో పాటు రైతులకు ఫిజికల్ పొజిషన్ ప్రకారం సర్వే నెంబర్లు, భూమిని రికార్డులు చేస్తామన్నారు. 15 రోజుల వ్యవధిలో మొదటి దశ పూర్తి చేస్తారని భరోసా ఇచ్చారు. ఈ సర్వేకు ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో రవి, తహసీల్దార్ సురేందర్, గోవర్ధన్, సర్వేయర్ ఏడీ రాంచందర్, అధికారులు, పంచాయతీ పాలకవర్గం, రైతులు పాల్గొన్నారు.