వరంగల్ అర్బన్ : రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇతర పార్టీల పనైపోయిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికలపై వరంగల్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. అధికార పార్టీ నేతలే ఒకరికి ఒకరు పోటీ పడి వారి పరిధిలో మెజారిటీ సాధించాలన్నారు.
హైదరాబాద్ తర్వాత వరంగల్ అంటే సిఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. అందుకే బడ్జెట్లో ఈ నగరానికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.
వచ్చే పది రోజులు అన్ని పనులు పక్కన పెట్టి ఎన్నికల కోసం మనం కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇతర పార్టీల పనైపోయింది. మనమే సమన్వయం చేసుకొని సత్తా చాటాలన్నారు.
సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఇతర నేతలు పాల్గొన్నారు.