ముంబై : తౌక్టే తుఫాన్ మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో కల్లోలం రేపగా ప్రధాని మోదీ కేవలం గుజరాత్ లోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం పట్ల శివసేన విమర్శలు గుప్పించింది. గుజరాత్ లో సంక్షోభాన్ని ఎదుర్కోలేని అసమర్ధ నాయకత్వం ఉన్నందువల్లే ప్రధాని ఆ రాష్ట్రాన్ని ఎంచుకున్నారని సేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఏ సంక్షోభం ఎదురైనా దీటుగా ఎదుర్కోగలరని, ప్రధానికి కూడా ఈ విషయం తెలుసునని రౌత్ పేర్కొన్నారు. మరోవైపు సేన ఎంపీ విమర్శలను కాషాయ పార్టీ తోసిపుచ్చింది.
ప్రధాని మోదీపై దాడి చేసే బదులు మహారాష్ట్ర మంత్రులు ఎసీ గదుల నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేయాలని బీజేపీ నేత రామ్ కదమ్ హితవు పలికారు. కొంకణ్ ప్రాంతంలో తుఫాన్ తీవ్రత అధికంగా ఉన్నా మహారాష్ట్ర మంత్రులు ఏ ఒక్కరూ అక్కడ పర్యటించలేదని మండిపడ్డారు.