హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాన్ని ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తున్నది. వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను రెట్టింపుచేసింది. శనివారం ఒక్కరోజే 1,15,311 నమూనాలను పరీక్షించగా, 3,187 మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్టు ఆదివారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 551, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 333, రంగారెడ్డిలో 271, నిజామాబాద్లో 251, నిర్మల్లో 154, జగిత్యాలలో 134, కామారెడ్డిలో 113, కరీంనగర్, సంగారెడ్డిలో 104 చొప్పున, వరంగల్ అర్బన్లో 98, ఆదిలాబాద్లో 92, నల్లగొండలో 83, సిద్దిపేటలో 81, ఖమ్మంలో 79, మహబూబ్నగర్లో 73 కేసులు వెలుగుచూశాయి. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో ఏడుగురు మృతిచెందారు. ప్రస్తుతం 20,184 మంది వివిధ దవాఖానలు, హోంఐసొలేషన్లో చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. శనివారం రికార్డుస్థాయిలో 3,495 పాజిటివ్ కేసులు నమోదవగా, 9 మంది మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యుల సూచనతో పవన్ హోంఐసొలేషన్లో ఉంటున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను వైద్యారోగ్యశాఖ వేగవంతం చేసింది. సెలవురోజుల్లోనూ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. రెండోదఫా వ్యాక్సినేషన్లో భా గంగా ఆదివారం 1,53,295 మందికి తొలిడోస్ వే శారు. 9,090 మందికి రెండోడోస్ వేశారు. తొలిడోస్ తీసుకున్నవారిసంఖ్య 1.76 లక్షలకు చేరగా, రెండుడోసులు తీసుకున్నవారి సంఖ్య 2.99 లక్షలకు చేరింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ వృథా 2.93 శాతమే ఉన్నదని, ఇది దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చితే అత్యల్పమని ఆదివారంనాటి బులెటిన్లో ఆరోగ్యశాఖ తెలిపింది.