కల్యాణలక్ష్మి, రైతుబీమా, కేసీఆర్ కిట్లు అదనం..
అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు
అభివృద్ధి పథంలో ఆదివాసీ గ్రామాలు..
కొత్త పంచాయతీ చట్టంతో కొత్త అందాలు
సంక్షేమం.. అభివృద్ధి.. పథకం ఏదైనా మూరుమూల ప్రాంతాలకు చేరితేనే సార్థకత. మరీ ముఖ్యంగా ఆదివాసీగూడేలకు అందితేనే సంపూర్ణం. తెలంగాణ ప్రభుత్వ పథకాలతో గిరిజన గ్రామాలు అభివృద్ధిపథంలో పయనిస్తున్నాయి. అడవి బిడ్డల బతుకుల్లో ఆనందం నింపుతున్నాయి. భగీరథతో స్వచ్ఛమైన నీళ్లు, విద్య, వైద్యం, పింఛన్లు, రైతు సంక్షేమ పథకాలు, నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాల స్వరూపమే మారిపోయింది. తెలంగాణ పల్లెల్లో అమలవుతున్న పథకాలను చూసి.. సరిహద్దు మహారాష్ట్రలోని గ్రామాల ప్రజలకు కన్నుకుడుతున్నది. తాము తెలంగాణలోనైనా లేకపోతిమని బాధపడుతున్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల ద్వారా ఓ మారుమూల గ్రామానికి ఏడాదికి కనీసం రూ.3.37 కోట్ల లబ్ధి చేకూరుతున్నది. అదిలాబాద్ జిల్లాలోని మారుమూల తలమడుగు, ఆదివాసీ గూడెమైన లక్సెట్టిపేటలో ప్రభుత్వ పథకాల అమలు.. వాటిని వినియోగించుకుని అభివృద్ధి జరిగిన తీరుపై ప్రత్యేక కథనం.
తిప్పన కోటిరెడ్డి (నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు ఉమ్మడి రాష్ట్రంలో కనీస వసతులకు కరువైన మండలకేంద్రం. ప్రజలు తాగునీటికి కూడా కటకటలాడారు. తెలంగాణ ఆవిర్భవించాక ఈ గ్రామానికి నిధుల వరద పారింది. రైతుబంధుతోపాటు ప్రభుత్వం అందించే వివిధ పెన్షన్ల కింద ఏటా రూ.3.37 కోట్లు చేరుతున్నాయి. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, దళితులకు మూడెకరాల భూమి వంటివాటితో ఏకమొత్తంలో పొందిన లబ్ధి రూ.4.50 కోట్లు.
వాటి వివరాలను పరిశీలిస్తే…
దొంగచింతలో..
ముప్పైఇండ్లు మాత్రమే ఉన్న దొంగచింత గ్రామాన్ని ఒకప్పుడు పట్టించుకున్నవారు లేరు. గతంలో వాగు దాటలేక గర్భిణీ పురిటినొప్పులతో మరణించింది. తెలంగాణ వచ్చాక ఐటీడీఏ ద్వారా రోడ్లు వేయడంతోపాటు, వాగుపై బ్రిడ్జిని నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. గూడెంలో నలుగురికి పెన్షన్ వస్తుండగా.. 15 మంది రైతుబంధు అందుకుంటున్నారు. పంచాయతీ నిధులతో ట్రాక్టర్ కొనుగోలు చేసుకున్నారు. పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసుకున్నారు.
క్రమం తప్పని నిధులు.. అభివృద్ధిలో పరుగు
నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా సీఎం కేసీఆర్ ప్రతి పంచాయతీకి క్రమం తప్పకుండా నేరుగా నిధులు అందజేస్తున్నారు. దీంతో తలమడుగు గ్రామానికి ప్రతి నెలా రూ.3,97,758 చొప్పున ఏడాదికి రూ.47,73,096 వచ్చాయి. వీటి ద్వారా గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు రూ.8,500 వేతనం ఇచ్చి 8 మంది మల్టిపర్పస్ వర్కర్లను నియమించారు. రూ.10 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను కొనుగోలు చేశారు. పల్లె ప్రకృతివనం, నర్సరీ, సేంద్రియ ఎరువుల తయారీ షెడ్లు నిర్మించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి చెట్లను పెంచారు. ఈ గ్రామ సర్పంచ్ కరుణాకర్రెడ్డి తన నెలవారీ గౌరవ వేతనాన్ని గ్రామాభివృద్ధికే వెచ్చిస్తానని ప్రకటించారు.
945 మందికి జాబ్ కార్డులు
గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2014 నుంచి 2021 వరకు 945 జాబ్ కార్డులిచ్చారు. ఈ పధకం కింద రూ.266.97లక్షలు ఖర్చు చేశారు. రూ.195.82 లక్షలు కూలిగా ఇచ్చారు. ఈ పథకం ద్వారా గ్రామంలో 14 రకాల పనులు చేపట్టారు. వీటితోపాటు ఉపాధి హామీ పథకం కింద రూ.60 లక్షలతో సీసీ రోడ్లను నిర్మించారు.
వ్యవసాయ అభివృద్ధికి..
రైతుల పంటలను నిల్వ చేసుకోవడానికి రూ.1.50 కోట్లతో 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్ను నిర్మించారు. ఈ గోడౌన్కు వెళ్లేందుకు వీలుగా రూ.36 లక్షలతో సీసీ రోడ్డును ఏర్పాటుచేశారు. గ్రామానికి ఆనుకొని రైతువేదిక నిర్మాణం చేపట్టారు. తలమడుగులో 98 శాతం భూముల రికార్డులు క్లియర్గా ఉన్నాయి.
ఆదివాసీ గ్రామం లక్సెట్టిపేటలో..
ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని లక్సెట్టిపేట ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గ్రామం. గ్రామంలోని 135 ఆవాసాలకూ మిషన్ భగీరథ తాగునీరు అందుతున్నది. 135 మందికి వివిధ రకాల పింఛన్లు వస్తున్నాయి. కల్యాణలక్ష్మి ద్వారా 15 మందికి లబ్ధి జరిగింది. యువత స్వయం ఉపాధికి ఐటీడీఏ రుణాలు అందజేసింది. లక్సెట్టిపేట హామ్లెట్ గ్రామానికి ప్రతి నెల లక్ష నిధులు వస్తున్నాయి. ముగ్గురు మల్టీపర్పస్ వర్కర్లను నియమించి పనులు చేయిస్తున్నారు. హరితవనం నిర్మించారు. శివరాత్రి తర్వాత సీసీరోడ్లు వేయాలని నిర్ణయించారు. ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరిస్తున్నారు. మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. చెత్తతో ఎరువులను తయారీకి ప్రత్యేకంగా షెడ్డును నిర్మించారు. శ్మశానవాటిక నిర్మాణం జరుగుతున్నది.
మా ఊరు తెలంగాణల ఉండకపోయె
మా గ్రామానికి పక్కనే ఉన్న లక్ష్మీపూర్ (తెలంగాణ)లో మాకు చుట్టాలున్నారు. అక్కడకు వెళితే లక్ష్మికళ కనిపిస్తున్నది. భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ రైతుబంధు వస్తున్నది. వృద్ధులకు పెన్షన్ అందుతున్నది. పక్కనే ఉన్న మా ఊరు తెలంగాణల లేదాయె అనిపిస్తది.
మధుకర్ హన్మంత్, తలాయిగూడ, యావత్మాల్ జిల్లా
50 ఏండ్లుగా జరుగని అభివృద్ధి ఐదేండ్లలో..
స్వరాష్ట్రంలో ఐదేండ్లలోనే 50 ఏండ్లుగా జరగని అభివృద్ధి సాధ్యమవుతున్నది. మా ఊరికి ఏటా రూ.6 కోట్ల లబ్ధి జరుగుతున్నది. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్స్ పథకాలన్నీ మా ఊరికొచ్చాయి. రైతువేదిక నిర్మించుకున్నాం. సీసీ రోడ్లు వేసుకున్నాం.
– కళ్లెం కరుణాకర్రెడ్డి సర్పంచ్, తలమడుగు
కేసీఆర్ భూమి ఇచ్చిండు
మా గ్రామంలో నాతోపాటు, 21 మందికి సీఎం కేసీఆర్ మూడెకరాల చొప్పున భూమి ఇచ్చారు. అందరి పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. పాస్పుస్తకం వచ్చింది. ఇంతకుముందు కూలికి వెళ్లేదాన్ని, ఇప్పుడు సొంత చేనులోనే పని చేసుకుంటున్నా. నా బిడ్డ పెండ్లి చేస్తే రూ.1,00,116 వచ్చినవి. నా భర్త మల్టిపర్పస్ వర్కర్గా పనిచేస్తున్నాడు
– సులిగల ఊశమ్మ, దళిత రైతు, తలమడుగు
మా ఊరికి రోడ్డు వచ్చింది
కొత్త పంచాయతీ చట్టంతో మాగూడెం పంచాయతీ అయింది. ప్రతినెల వచ్చే నిధులతో గ్రామాభివృద్ధి చేసుకుంటున్నాం. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చారు. మా ఊరికి ఐటీడీఏ నిధులతో రోడ్డు వేశారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి.
బాబూరావు, కొడప్ప, కుమ్రజుగాధిరావు, దొంగ చింత
అన్ని ఆవాసాలకు నల్లా నీళ్లు
పూర్తి ఆదివాసి అటవీప్రాంతమైన ఊట్నూరు మండలంలో 191 ఆవాసాలున్నాయి. ప్రతి ఆవాసానికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉన్న నాలుగు ఆవాసాలకు పైప్లైన్కు అనుమతి ఇవ్వలేదు. బోర్లు వేసి సోలార్ ప్యానల్ ద్వారా పంప్ బిగించి మంచినీళ్లు అందిస్తున్నాం.
క్రాంతికుమార్, ఏఈఈ, మిషన్ భగీరథ, ఊట్నూర్ మండలం
మరిన్ని వార్తలు చదవండి..
తపాస్పల్లికి మల్లన్నసాగర్ నీరు
మల్లన్నసాగర్ నుంచే నిజాంసాగర్కు