బెంగళూర్ : ట్రాలీ బ్యాగ్ వీల్స్లో రూ 5.3 లక్షల విలువైన బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడు (21) కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. అరెస్ట్ అయిన యువకుడిని కేరళలోని కాసరగాడ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దుబాయ్ నుంచి వచ్చిన యువకుడు గురువారం రాత్రి 12.30 గంటలకు బెంగళూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాడు. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్కు వెళుతుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ సిబ్బంది యువకుడిని తనిఖీ చేయడంతో బంగారం తరలిస్తున్నట్టు వెల్లడైంది.
గల్ఫ్కు ఎందుకు వెళ్లావని, కేరళకు తిరిగివెళ్లకుండా..బెంగళూర్లో ఎందుకు ల్యాండ్ అయ్యావని అధికారులు అడిగిన ప్రశ్నలకు యువకుడు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో అతడి బ్యాగేజ్ను వారు తనిఖీ చేశారు. ట్రాలీ బ్యాగ్ వీల్స్ను బ్రేక్ చేసి చూడగా వాటిలో 115.2 గ్రాముల బరువున్న బంగారం లభ్యమైంది. మార్కెట్లో ఈ బంగారం విలువ రూ 5.32 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ముఠాల ప్రమేయంతో యువకుడు బంగారం స్మగ్లింగ్కు పూనుకుని ఉంటాడని కస్టమ్స్ సిబ్బంది భావిస్తున్నారు. ఈ పనిచేసేందుకు వారు యువకుడికి ఉచితంగా రిటన్ టికెట్లు ఆపర్ చేయడంతో పాటు కొద్దిమొత్తంలో నగదు ఆఫర్ చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.