ఇల్లెందు: గ్రామాల అభివృద్దే టీఆర్ఎస్ లక్ష్యమని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఒంపుగూడెం ప్రాంత వాసులు ఎమ్మెల్యే హరిప్రియ, హరిసింగ్నాయక్ దంపతును సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా మాణిక్యారం పంచాయతీలోని ఒంపుగూడెం కోటగడ్డలో రోడ్డు లేక ఆ గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రోడ్డు సౌకర్యం లేక రాకపోకలు సాగించాలంటే నరకయాతన పడేవారన్నారు. వారి ఇబ్బందులు తొలగించాలన్న సంకల్పంతో రోడ్డు నిర్మాణ పనులకు డీఎంఎఫ్టీ నుంచి నిధులను మంజూరు చేయించడం జరిగిందన్నారు. రోడ్డు సమస్య పరిష్కారం కావడంతో ఆ గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేవన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ది చెందాయని ఆమె అన్నారు.
పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ, నగరాల రూపురేఖలు మార్చారన్నారు. తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు పెడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బానోత్ హరిసింగ్నాయక్, మండల కన్వినర్ ఖమ్మంపాటి రేణుక, నాయకులు యలమద్ది రవి, పులిగళ్ళ మాధవరావు, జనగం కోటేశ్వరరావు, నూనావత్ లష్కర్, ఊకే సత్యం, రమేష్, జోగా వీరస్వామి, లింగన్న, శ్రీను, రామటెంకి అశోక్, కృష్ణ, బీనబోయిన రాము, లక్ష్మీనారాయణ, మంకిడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.