భద్రాద్రి కొత్తగూడెం : బాధిత స్థితిలో ఇంటిని విడిచిపెట్టిన మహిళ 25 సంవత్సరాల తర్వాత ఖమ్మంకు చెందిన అన్నం సేవా ఫౌండేషన్ కృషితో తిరిగి కుటుంబ సభ్యులను కలిసింది. మహిళ దశాబ్దం పాటు దౌర్భాగ్యమైన జీవితాన్ని గడిపింది. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, పారా-లీగల్ వాలంటీర్ అన్నం శ్రీనివాస రావు కృషితో మహిళ మమూలు మనిషై కుటుంబ సభ్యులను చేరింది.
ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లా అర్బాయి గ్రామానికి చెందిన శాంతి దేవి అనే మహిళ 25 ఏళ్ల క్రితం ఇళ్లు విడిచి వెళ్లింది. ఈమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భద్రాచలంలో నివసించే ఈమె గురించి స్థానికొడొకరు డిసెంబర్ 2019లో సమాచారం ఇచ్చాడు. అప్పట్లో ఆమె ఫుట్పాత్లపై, రహదారుల వెంబడి తాత్కాలిక గుడారం వేసుకుని నివసిస్తుండేది.
ఆ సమయంలో ఆమె ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఎవరినీ తన దగ్గరకు రానీచ్చేది కాదు. దీంతో ఆమె నేపథ్యం, గుర్తింపు ఎవరికీ తెలియదు. దొరికింది తిని, డ్రైనేజీ నీరే త్రాగుతూ, దాంతోనే స్నానం చేస్తుండేది. స్థానిక పోలీసుల సహాయంతో మహిళను ఖమ్మంలోని ఫౌండేషన్ అనాథాశ్రమానికి తరలించాం. ఆ సమయంలో ఆమె మానసికంగా చాలా బలహీనంగా ఉండటంతో ఆమె పేరు, స్వస్థలం, ఎటువంటి వివరాలు చెప్పలేదు.
అనంతరం సరైన పోషణ, వైద్య సంరక్షణతో ఆమె పరిస్థితి మెరుగుపడింది. ఇటీవలే తన గతాన్ని గుర్తుతెచ్చుకుంది. తెలియని కారణాల వల్ల దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం తన భర్త, పిల్లలను విడిచిపెట్టినట్లు చెప్పింది. ఆమె తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులను సంప్రదించి విచారణ చేయడంతో అంతా నిజమేనని తేలింది. మహిళ భర్త 2013లో మరణించాడని, ఆమె పిల్లలు జీవనోపాధి నిమిత్తం గ్రామాన్ని విడిచిపెట్టారని పోలీసులు తెలుసుకున్నారు.
మహిళ చిన్నకుమారుడు దినేష్ ఆచూకీని కనుగొన్నారు. తల్లి ఇల్లు వదిలి వెళ్లినప్పుడు ఇతని వయస్సు 10 ఏళ్లు. దినేష్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు మహిళతో వీడియో కాల్ మాట్లాడి ఆమెను గుర్తించారు. తల్లిని తనతో తీసుకెళ్లేందుకు దినేష్ భద్రాచలం వచ్చాడు. దినేష్ వయస్సు ఇప్పుడు 35 ఏళ్లు. తల్లిని చూసిన వెంటనే అతడు తల్లి పాదాలపై పడి కన్నీటి పర్యంతమయ్యాడు. చనిపోయిందనుకున్న తన తల్లిని కాపాడి, సంరక్షించి తిరిగి తమతో కలిపినందుకు దినేష్.. శ్రీనివాస్రావుకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.
రైల్వే టికెట్లు బుక్ చేసి ఇద్దరు వాలంటీర్లను ఇచ్చి మహిళను కొడుకుతో పాటు స్వస్థలానికి శ్రీనివాస్ పంపించారు. మహిళ కుటుంబ సభ్యులతో కలిసేందుకు స్థానిక వాలంటీర్లు శ్రీరంగం సంపత్, కె. నాగరాజు సహాయం చేశారు. నిరాశ్రయుల పట్ల అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్రావు శ్రద్ధను ఏఎస్పీ వినీత్ ప్రశంసించారు.