భద్రాచలం: పర్ణశాల వద్ద గోదావరి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాదు ఈ ప్రభావంతో మండలంలో ఉన్న చిన్న గుబ్బల మంగి, శిల్పివాగులు వరదనీరు చేరడంతో పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పాటు పర్ణశాల శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయ పరిసరాల్లోని సీతవాగు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నారచీరెల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది.
ఈ కారణంగా దూరప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు స్వామివారిని దర్శనం చేసుకుని ఆ ప్రాంతాన్ని చూడకుండానే తిరిగి వెళుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండల అధికారులు ముంపు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూ ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు.