సారపాక:సారపాక ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్టు కార్మికులకు వైద్యం అందించే ఈఎస్ఐ ఆసుపత్రిలో వరంగల్ జాయింట్ డైరెక్టర్ హేమలత శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈఎస్ఐ డిస్పెన్సరీలో కార్మిక కుటుంబాలకు ఎలాంటి వైద్యసేవలు అందుతున్నాయనే విషయాలను గురించి డాక్టర్ చందును అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నేతలు ఈఎస్ఐ వద్దకు వెళ్లి నెలకు రూ.25లక్షలు 3500 మంది కార్మికుల వేతనాల్లో కటింగ్ ద్వారా సొమ్ములు చెల్లిస్తున్నారని, దీనికి తగినట్లుగా సేవలు అందడంలేదని ఆమె దృష్టికి తీసుకువెళ్లారు.
30 పడకల ఆసుపత్రి కావాలని, ఈఎస్ఐ లోకల్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని, నిత్యం వైద్యుని పర్యవేక్షణ ఉండేలా చూడాలని, కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని ఆమెకు మెమోరాండం అందజేశారు. దీనికి స్పందించిన హేమలత తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషిచేస్తానని కార్మిక నేతలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ వైద్యుడు చందుతో పాటు సిబ్బంది, కార్మిక నేతలు పాల్గొన్నారు.