దమ్మపేట : వన్యప్రాణుల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాత పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని రంగువారిగూడెం గ్రామ శివారున సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు… రంగువారం గూడెం గ్రామానికి చెందిన పొద్దుటూరి డానియల్ (43) తన కుమారుడు రాకేష్ అలియాస్ బాలు (21)విజయ్ కుమార్ తో కలిసి వన్యప్రాణుల వేటకు అడవిలోకి వెళ్లారు.
అయితే మార్గమద్యలో వన్యప్రాణులను హత మార్చటానికి గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్ తీగలకు కాలు తగిలి షాక్కు గురైన బాలును కాపాడటానికి యత్నించిన డానియల్ సైతం షాక్కు గురై సంఘటన స్థలంలోనే మృతి చెందారు. సుజాత ఫిర్యాదు మేరకు ఎస్హెచ్ఓ వెంకటరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని అశ్వారావుపేట సీఐ ఉపేంద్రరావు సందర్శించారు.