భద్రాచలం : వాడవాడలా జెండా పండుగను వేడుకలా నిర్వహించాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాల కమిటీలను పునరుద్ధరించడంతో పాటు గ్రామ, మండల, జిల్లా కమిటీలకే క్షేత్రస్థాయిలో పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కమిటీల్లో యువతకు ప్రాధాన్యత ఇచ్చి సంస్థాగతంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జెండా పండుగ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
ఏడు దశాబ్ధాలుగా సాధించలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ సార్ ఏడేళ్లలో చేసి చూపించారని తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే కార్యకర్తలకు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని, ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని సూచించారు. భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పట్టణంలో, గ్రామగ్రామాన, వాడవాడలా, ఘనంగా జెండా పండుగను జరపాలని ఆయన కోరారు.