అశ్వారావుపేట :ధాన్యం కొనుగోలులో ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా రైతు తీసుకువచ్చిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసేవిధంగా చూడాలని ఎంపీపీ, జడ్పీటీసిలు జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, చిన్నంశెట్టి వరలక్ష్మీ రైతు సమన్వయ సమితి మండల కన్వినర్ జూపల్లి రమేష్ లు అధికారులకు సూచించారు. మంగళవారం అశ్వారావుపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్ధార్ చల్ల ప్రసాద్తో కలసి ప్రజాప్రతినిధులు సందర్శించారు. కేంద్రానికి రైతులు చేర్చిన ధాన్యం రాశులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు.
రబీ సాగు పంటను కేంద్రం కొనుగోలు చేసేందుకు ససేమిరా అనటంతో రైతులు ఇతర పంటల సాగుపై ఆసక్తి చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బండి పుల్లారావు, నాయకులు కోటగిరి సీతారామస్వామి, సంపూర్ణ, జూపల్లి బ్రహ్మారావు, తలసిల ప్రసాద్, సర్పంచ్లు రమ్య, జ్యోష్ణాబాయ్, సిఈఓ మానేపల్లి విజయ్కుమార్, రైతులు రాంబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.