అశ్వారావుపేట: మత్యశాఖ ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మత్యశాఖ అధికారి వరదారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని పెదవాగు ప్రాజెక్టులో 3,30,750నీలకంఠ రొయ్య పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. గిరిజనులు ఆర్థికంగా అభివృద్ది చెందడానికి మత్యశాఖ విశేషంగా కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే చేపలు పట్టటంలో శిక్షణ, వల్లలు, టీవీఎస్ మోపడ్లు ఇవ్వటం జరిగిందన్నారు.
గుమ్మడవల్లి,బచ్చువారిగూడెం గిరిజన మత్య సంఘం సోసైటీ సభ్యులు కలిసి కట్టుగా చేపలను పెంచుకోవాలని, వివాదాలకు తావులేకుండా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు కారం మల్లయ్య, సభ్యులు జెట్టి వెంకటేశ్వర్లు, మత్యశాఖ సిబ్బంది మంగరాజు, రాంబాబు, అనిల్, గుమ్మడవల్లి,కోయరంగాపురం పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.