కొత్తగూడెం : జిల్లా కేంద్రం సమీపంలోని రామాంజనేయకాలనీలో వద్ద ఉన్న వనమా రజక కాలనీలో గత సంవత్సర కాలంగా నివాసం ఉంటున్న తమకు ఇంటి పన్నులు, కరెంటు, తాగునీటిని సరఫరా చేయాలని తెలంగాణ రజక సంఘాల సమితి నాయకులు కోరారు. సోమవారం పాతపాల్వంచలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఆయన స్వగృహంలో కలిసి తమసమస్యలను విన్నవించారు.
1986లో అప్పటి ప్రభుత్వం రజకుల నివాసం కోసం 5.20 ఎకరాల భూమిని కేటాయించిందని, అప్పటి నుంచి ఇళ్లు నిర్మించిన ప్రతీ సారి భూ ఆక్రమదారులతో గొడవలు జరుగుతున్నాయని, హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నామని, గత ఏడాది కాలంగా రజకవాడలోనే ఉంటున్నామన్నారు.
విద్యుత్ సౌకర్యం లేక చీకటిలో కాలం వెళ్లదీస్తున్నామని, తమపై దయ ఉంచి ప్రభుత్వం తమకు కేటాయించిన 250 ఉచిత యూనిట్ల కరెంటు మీటర్లకు తాము అర్హులమని, వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. దీంతో పాటు గ్రీవెన్స్డేలో కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు కణతాల వసంతరావు, పోగుల లక్ష్మీనారాయణ, మారెపల్లి రవి, మల్లయ్య, బాస్వపల్లి సత్తెమ్మ, రేకుంట్ల శ్రీను, చిటికెన భాస్కర్రావు, కసింకోట సుజాత, ఉల్లంగుల దశరథం, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు