భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మి తాయారమ్మ వారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ విశేష పూజలందుకుంటున్నారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలు, నదీ జలాలతో, 9రకాల పళ్ల రసాలతో అభిషేకం చేశారు. చిత్రకూట మండపంలో వేదపండితులు శ్రీరామాయణ పారాయణం చేశారు.
యాగశాలలో శాస్త్రోక్తంగా హోమం నిర్వహించారు. మధ్యాహ్నం 3గంటలకు అమ్మవారిని విజయలక్ష్మిగా అలంకరించి, భక్తుల దర్శనం కోసం అమ్మవారి ఆలయంలోనే వేంచేపు చేశారు.ఈ సందర్భంగా మహిళా భక్తులు అమ్మవారి కుంకుమార్చన చేశారు. అమ్మవారి ఆలయానికి అభిముఖంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య కు దర్భార్ సేవ జరిపారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆస్థాన హరిదాసులు తూము నర్సింహాదాసు, భక్త రామదాసు కీర్తనలు ఆలపించారు. మంగళవారం అమ్మవారు ఐశ్వర్య లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.