భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ప్రసాదం ధరలు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్ధం, ప్రస్తుతం పెరిగిన మార్కెట్ ధరల దృష్ట్యా రేట్లను పెంచుతున్నట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ ఓ ప్రకటనలో తెలిపారు. కేజీ చక్కెర పొంగళి రూ.400లు, పులిహోరం కేజీ రూ. 250లు, కేజీ లడ్డూ రూ. 700లు, అప్పాలమాల 1కిలో రూ.300లు, వడమాల 1కిలో రూ.300లు పెంచడానికి ప్రతిపాదనలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రసాదం ధరలను పెంచడానికి ప్రతిపాదించిన వివిధ రేట్లపై భక్తులు తమ సలహాలు, సూచనలు, అభ్యంతరాలు లిఖిత పూర్వకంగా, ఈ ప్రకటన వెలువడిన 15రోజుల్లోగా దేవస్థానం కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఒకవేళ భక్తుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవని భావిస్తే ,ఇవే ధరలను అమలు చేయడం జరుగుతుందని ఈఓ తెలిపారు.