కొత్తగూడెం: జాతీయ స్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీలకు స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో సబార్డినేట్గా విధులు నిర్వహిస్తున్న ఎం.రాము ఎంపికయ్యారు. అదే విధంగా కొత్తగూడానికి చెందిన క్రీడాకారుడు సర్వేష్ ఎంపికైనట్లు హాకీ జిల్లా అసోసియేషన్ చైర్మన్ పల్లపోతు శ్రీనివాస్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనపర్చిన 18 మంది సభ్యులతో కూడిన తుది జట్టును ఎంపిక చేశారు. తుది జట్టులో కొత్తగూడానికి చెందిన సర్వేష్, రాములు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
జాతీయ స్థాయి పోటీలలో సైతం తెలంగాణ జట్టు రాణించాలని, ఈ టీమ్ కు ఎంపికైన అటవీ సిబ్బందిని జిల్లా అటవీ శాఖ అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్, కార్యాలయ సూపరింటెండెంట్ కేఎస్ఎన్ మూర్తి, హాకీ జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. ఈ నెల 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మహారాష్ట్రంలోని పూణే వేదికగా జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ భట్టు ప్రేంకుమార్, ఇమంది ఉదయ్కుమార్లు తెలిపారు.