దమ్మపేట: పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య కోరారు. దమ్మపేటలోని ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామాయిల్ మొక్కల పంపిణీలో ప్రాధాన్యత పాటించకుండా పలుకుబడి వున్నవారికి, తాయిలాలు అందిస్తున్న వారికి రాయితీ మొక్కలు ఇస్తున్నారని అన్నారు.
పామాయిల్ చట్టంలో కార్పొరేట్ కంపనీలతో కుమ్మక్కై దళారి వ్యవస్థను ప్రవేశపెట్టారని అన్నారు. దీని ద్వారా ఆంధ్రా నుంచి రోజుల తరబడి నిల్వవున్న పామాయిల్ గెలలను కొనుగోలు చేసి ఆయిల్ రికవరీ తగ్గిపోవడానికి కారణమయ్యారని అన్నారు. ఆంధ్రాకు చెందిన మహిళ బ్యాంకు ఖాతాలో ఆయిల్ఫెడ్ డబ్బు జమచేసినట్లు ఆధారాలున్నాయని చెప్పారు. దీనిపై ఐఏఎస్ అధికారి నేతృత్వంలో విచారణ జరిపించి చర్యలు తీసుకుని మన రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.