చాదర్ఘాట్ : కుటుంబ పెద్ద దిక్కు… రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్డెడ్తో మరణించాడు. కుటుంబమంతా శోఖసంద్రంలో ఉన్నా… అవయవదానంతో బాధితుని చివరి కోర్కెను నెరవేర్చేందుకు స్వచ్చంధంగా అంగీకరించి మరికొంత మంది జీవితాల్లో వెలుగులు నింపారు.వివరాల్లోకి వెళ్తే..కొత్తగూడెం భద్రాద్రి జిల్లా మణుగూరు టీఎస్ జెన్కో బీటీపీఎస్ లో జేపీఏగా పని చేస్తున్న అనిల్కుమార్(45) ఈ నెల 11 న పాల్వంచ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక దవాఖానలో ప్రథమ చికిత్స అందించి మెరగైన వైద్యం కోసం మలక్పేటలోని యశోద దవఖానకు తరలించారు. అనిల్కుమార్ తలకు తీవ్ర గాయం కావడంతో శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆరు రోజులుగా వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించినప్పటికీ బ్రెయిన్డెడ్తో కనుమూశాడు. కాగా అనిల్కుమార్ కుటుంబం జీవన్దాన్ ద్వారా అవయవ దానం చేసేందుకు ముందుకువచ్చారు.
ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన అవయవదానం…
బ్రెయిన్ డెడ్ అయిన అనిల్కుమార్ అవయవాలు దానం చేయడంతో ఆరుగురి జీవితాల్లో వెలుగులునింపనున్నది. అనిల్కమార్ గుండెను గ్రీన్ చానెల్ ద్వారా చెన్నైలోని ఓ దవాఖానకు, కిడ్నీలను జూబ్లీహిల్స్ అపోలో, యశోద దవాఖానకు, లివర్, ఊపిరితిత్తులు సికింద్రాబాద్లోని యశోదా దవాఖానకు తరలించి అక్కడి రోగుల చికిత్స కు అందజేయనున్నారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మృతదేహానికి యశోద దవాఖాన సిబ్బంది నివాళ్లు అర్పించారు.