కరకగూడెం: మండలంలో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు. తొలుత తుమ్మలగూడెం గ్రామ పరిధిలోని గండిఒర్రె చెరువు అలుగును పరిశీలించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు గండి ఒర్రె చెరువు అలుగు కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన అలుగు ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన అలుగు నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
అలాగే పద్మాపురం గ్రామ రైతులు బుగ్గచెరువు అలుగు మరమ్మతులు చేపట్టాలని విప్ రేగాను కోరగా స్పందించిన రేగా అలుగు మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అక్కడ నుంచి తుమ్మలగూడెం, రేగుళ్ల, చొప్పాల గ్రామాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడిన ఆయన పొలంలో రైతులు విద్యుత్ బోర్లు వేసుకున్న రైతులకు త్రీఫేజ్ విద్యుత్ లైన్ను ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను కోరారు.
అలాగే తుమ్మలగూడెం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాల్లో పాల్గొని విప్ రేగా చిన్నారులకు పౌష్టికాహారం అందజేశారు. పలు గ్రామాల్లో గ్రామస్తులతో ముచ్చటించి సమస్యలను అడిగా తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రానికి చేరుకున్న ప్రభుత్వ విప్ రేగా పడిగాపురం గ్రామానికి చెందిన మద్దెల నిర్మల ఇటీవల డెంగ్యూతో మృతి చెందింది. కుటుంబ సభ్యులను పరామర్శించి రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి రూ.20వేల ఆర్ధిక సాయం అందజేశారు.
కుటంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళీక, జడ్పీటీసీ సభ్యులు కొమరం కాంతారావు, ఇగిగేషన్ ఏఈఈ సక్రూ, పీఆర్ఏఈ వెంకట్, విద్యుత్ ట్రాన్స్కో ఏఈ రామకృష్ణ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, నాయకులు కొంపెల్లి పెదరామలింగం, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, రాము, పాపారావు, ప్రవీణ్, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.