జూలూరుపాడు: అంగన్వాడీ కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు, చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల పరిధిలోని అన్నారుపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, పడమటనర్సాపురం గ్రామంలోని గిరిజన ఆశ్రమ ఉన్నతపాఠశాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలోని సరుకులను పరిశీలించారు. అంగన్వాడీకి వస్తున్న పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సమయపాలన పాటిస్తూ మెనూ ప్రకారం విద్యార్ధులకు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ఆశ్రమ పాఠశాలలోని రికార్డులను పరిశీలించి, తరగతి గదులకు వెళ్లి విద్యార్ధునుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వీరి వెంట ఎంపీవో రామారావు, అన్నారుపాడు సర్పంచ్ పద్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చౌడం నర్సింహారావు, నాయకులు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.