అశ్వారావుపేట:తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిందేనని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రింగ్ రోడ్డు సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పకుంటున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా మోసం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి బీజేపీ నాయకులు ధాన్యం కొనాలని దర్నా చేయటం విడ్డూరంగా ఉందని, ధాన్యం కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించటం సరికాదని హితవు పలికారు. రా్రష్ట్రంలోని రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వానికి ధాన్యం సేకరించాలని చెప్పలేని అసమర్దత బీజేపీ నాయకులు పూటకో మాట చెపుతూ పబ్బం గడుపుకంటున్నారని ధ్వజమెత్తారు.
రైతును రాజుగా నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలతో తెలంగాణ రైతాంగానికి తోడ్పాటునిస్తున్నారని, ఇప్పటికే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, చెరువుల పునరుద్దరణ, విత్తన, ఎరువుల కొరత నియంత్రణ వంటి పకడ్బందీ చర్యలతో రైతులు సంతోషంగా ఉన్నారని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక తెలంగాణ రైతులను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో బీజేపీకి రాష్ట్ర రైతులు తగిన బుద్ది చెపుతారని చెప్పారు.
రైతు సంక్షేమం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంపై ధాన్యం పూర్తిగా సేకరించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు చిన్నంశెట్టి వరలక్ష్మీ, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, రైతు సమన్వయ సమితి మండల అద్యక్షులు జూపల్లి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, అశ్వారావుపేట సొసైటీ అద్యక్షులు నూతక్కి నాగేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అద్యక్షులు బండి పుల్లారావు, నాయకులు బండారు శ్రీనివాసరావు, సత్యవరపు సంపూర్ణ, చందా లక్ష్మీనర్సు, కలపాల శ్రీనివాసరావు, మందపాటి రాజమోహన్రెడ్డి, చిన్నంశెట్టి వెంకట నరసింహాం, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ కమిటీ బాద్యులు, రైతులు పాల్గొన్నారు.