కొత్తగూడెం: ఈ నెల25వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారిణి సులోచనారాణి అధికారులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు ఎటువంటి భయాందోళనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేయాలని, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నియమ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని అన్నారు.
పరీక్షలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుందని,ఇంటర్మీడియట్ బోర్డు సూచించిన 70 శాతం సిలబస్లోనే ప్రశ్నాపత్రాలు ఉంటాయనిచెప్పారు. పరీక్ష సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉందని, నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరీక్షల సిబ్బంది,ఫ్లైయింగ్ స్కాడ్స్, సిట్టింగ్ స్కాడ్స్ పాల్గొన్నారు.