భద్రాద్రి కొత్తగూడెం : ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునల్ కింద కేసుల భౌతిక విచారణకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం దేశంలోని అన్ని న్యాయస్థానాలు కేసులను వర్చువల్ పద్దతిలో విచారిస్తున్నప్పటికీ కలెక్టర్ అనుదీప్ కేసుల భౌతిక విచారణకు అనుమతించడం సుప్రీం మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని వారు ఆరోపించారు.
క్లయింట్లు, న్యాయవాదులు కోర్టులో భౌతికంగా హాజరుకావద్దని జూన్ 30 వరకు వర్చువల్ విధానంలో మాత్రమే హాజరు కావాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందన్నారు. అయితే కలెక్టర్ సుప్రీం ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారన్నారు. ప్రతిరోజూ సగటున 25 కేసులు విచారణకు వస్తున్నాయన్నారు. ఒక కేసు కోసం ఇద్దరు న్యాయవాదులు, నలుగురు క్లయింట్లు హాజరుకావడంతో, జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి కనీసం 150 మంది రెవెన్యూ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని అసోసియేషన్ నాయకులు అన్నారు. కొవిడ్ తీవ్రత నేపథ్యంలో ఈ చర్య ఎంతమాత్రం తగదన్నారు.
ఇంత భారీ సంఖ్యలో సమావేశం కావడం క్లయింట్ల జీవితాలతో పాటు న్యాయవాదులకు కూడా ముప్పు తెచ్చిపెడుతుందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వర్చువల్ హియరింగ్ కోరుతూ బార్ అసోసియేషన్ ఇప్పటికే రెండుసార్లు కలెక్టర్కు విజ్ఞాపన పత్రాలు అందజేసినట్లు చెప్పారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్ వి రాజేష్, జాయింట్ సెక్రటరీ కసాని రమేష్, కోశాధికారి ఎండి. సాదిక్ పాషా, ఆఫీసు బేరర్లు ఎ కరుణకర్, సంతోష్ సాహు, పర్యవేక్షణ కమిటీ సభ్యుడు మెండు రాజమల్లు తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదిస్తామని వారు తెలిపారు.