కొత్తగూడెం: కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప రాజకీయ మేధావి, స్వాతంత్య్ర, తెలంగాణ ఉద్యమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్న మహనీయుడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ కొనియాడారు. సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిరంచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇటువంటి మహనీయుడు మన తెలంగాణలో జన్మించడం మనందరికీ గర్వకారణమని అన్నారు. తెలంగాణకు వీరు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం భావితరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఆయన జన్మదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆయన అనుసరించిన సిద్దాంతాలు, మనందరికీ స్ఫూర్తి అని, ప్రజా సేవను తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెనుబడిన తరగతుల సంక్షేమ అధికారి సురేందర్, బీసీ సంఘాల నాయకులు కొల్లు పద్మ, మాడిశెట్టి శ్రీనివాస్, రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.