ఆ పాటలు విన్నప్పుడు కాదు.. అలా విధిని జయించిన వాళ్లను చూసినప్పుడు అనిపిస్తుంది.. ఆత్మవిశ్వాసం అంటే ఏమిటో. పుట్టుకతోనే రెండు చేతులు, ఒక కాలు లేని వ్యక్తి.. అన్నీ సకలంగా ఉన్న వారిని మించి అన్నీ చేయగలడు. రాయడం, చదవడం, తినడం వంటి తన పనులే కాదు.. మిగతా పనులూ చేయగలడు. ఈత కొట్టగలడు. సైకిల్ తొక్కగలడు. క్రికెట్ ఆడగలడు. మిషన్ కుట్టగలడు. ‘ఉపాధి’ పనులు చేయగలడు. ఇవనే కాదు.. అన్నీ చేయగలడు. దటీజ్ వెంకన్న. ఇక సతీశ్ కూడా ఇంతే.. రెండేళ్ల వయసులోనే పోలియోబారిన పడ్డాడు. అతడి రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. అయినా ఎక్కడా నిరాశపడలేదు. ధైర్యంగా ముందుకు కదిలాడు. ఉన్నత చదువులు చదివాడు. తన కాళ్లపై తాను నిలబడ్డాడు. మరెందరినో నిలబెడుతున్నాడు. ఆత్మవిశ్వాసానికి, అసమాన సంకల్పానికి నిదర్శనంగా నిలబడ్డారు.. స్ఫూర్తిదాతలైన వెంకన్న, సతీశ్.
‘మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ.. పట్టుదలే ఉంటే కాగలడు మరోబ్రహ్మ..’ అన్నారు గేయ రచయిత వేటూరు సుందరరామ్మూర్తి. కృషి ఉంటే మనుషులు మహాపురుషులవుతారనీ తరతరాలకూ తరగని వెలుగవుతారనీ సెలవిచ్చారాయన. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడని, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలని, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలని ధైర్యం నూరిపోశారు మరో పాటల రచయిత చంద్రబోస్.
ఉపాధినిస్తున్న ‘సతీశ్’
కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన గుండపనేని కిషన్రావు, కోమల దంపతుల ఏకైక కుమారుడు గుండపనేని సతీశ్.. రెండేళ్ల వయసులోనే పోలియో బారిన పడ్డాడు. అతడి రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. అయినా పట్టుదలతో ఎంటెక్ పూర్తి చేశారు. హైదరాబాద్లో ఒక ప్రైవేటు ఐటీ కంపెనీలో ఉద్యోగిగా చేరారు. కానీ ఆ ఉద్యోగం అతడికి సంతృప్తినివ్వలేదు. ఏదో సాధించాలనే తపన తనలో కలిగింది. తిరిగి కొత్తగూడేనికి చేరుకున్నాడు. 2010లో అప్పటికే నష్టాల్లో ఉన్న ఓ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ను తీసుకున్నాడు. 2018 వరకు అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడు. పాల్వంచ, ఇల్లెందు ప్రాంతాల్లో కూడా తన ఇనిస్టిట్యూట్లను విస్తరించాడు. తాను ఉపాధి పొందుతూ తనతోపాటు మరో 50 మందికి పని కల్పిస్తున్నారు. తన ఇనిస్టిట్యూట్లో దివ్యాంగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. మందలో ఒకడిగా కాకుండా కనీసం వందలో ఒకడిగా ఉండాలనే స్వామి వివేకానంద సూక్తే తనకు స్ఫూర్తి అంటాడు సతీశ్.
ఇక దివ్యాంగుల హక్కుల సాధనలో ఉద్యమకారుడిగా, సమాజ సేవకుడిగా గుర్తింపు పొందాడు. తోటి వారి సంక్షేమానికి పాటుపడుతూ స్ఫూర్తిగాయకంగా నిలుస్తున్నాడు. జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించడంతోపాటు వాటిని ప్రభుత్వాలు, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాడు. దివ్యాంగులకు ప్రభుత్వం కల్పిస్తున్న హక్కులు, రాయితీల గురించి తోటి దివ్యాంగులకు అందేలా కృషి చేసేందుకు 2014లో తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘాన్ని స్థాపించారు. దివ్యాంగుల్లో ఆత్మైస్థెర్యం నింపేందుకు సామాజిక కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నాడు. కరోనా లాక్డౌన్ సమయంలో జీవనోపాధిని కోల్పోయిన దివ్యాంగ కుటుంబాలకు సంఘం తరఫున నిత్యావసరాలు, బియ్యం పంపిణీ చేశాడు. యాచకులు, నిరుపేదలు, వలస కూలీలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. సతీశ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా మూడు జాతీయస్థాయి అవార్డులు, రెండు రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. ఇంకా వివిధ రకాల పురస్కారాలు ఎన్నో వరించాయి. కలెక్టర్లతోపాటు ఇతర ఉన్నతాధికారుల నుంచి ప్రశంసా పత్రాలూ అందుకున్నాడు.
చిన్నబోయిన వైకల్యం..
కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన నిరుపేదలు కొండమీది భిక్షం, ఎల్లమ్మ దంపతులకు పెద్ద కుమారుడు వెంకన్న. పుట్టుకతోనే రెండు చేతులు మణికట్టు వరకు లేవు. ఓ కాలి పాదం పూర్తిగా లేదు. మొండి కాలు, మొండి చేతులతో జన్మించాడు. కొన్ని రోజులకు తండ్రి చనిపోయాడు. ఆ తల్లి కూలిపనులకు పోయి ఇతణ్ని పెంచి పెద్ద చేసింది. తల్లి ప్రోత్సాహం, చుదువుకోవాలనే పట్టుదల.. వెంకన్న అంగవైకల్యం ముందు చిన్నబోయాయి. చిన్నతనంలో పూర్తిగా తల్లి సహాయంతో పనులు చేసుకున్న వెంకన్న.. 8 ఏళ్ల తరువాత తన పనులన్నీ తానే చేసుకోవడం మొదలుపెట్టాడు. పాఠశాలకూ వెళ్లాడు. వెంకన్న పేదరికాన్ని, అతడి వైకల్యాన్ని గమనించిన క్రాంతి పాఠశాల డైరెక్టర్.. అతణ్ని చేరదీసి ప్రోత్సహించారు. 10వ తరగతి వరకు అన్నీ తానై చదివించారు. టెన్త్లో 70 శాతం మార్కులు సాధించాడు. దీంతో అతడి ఆత్మవిశ్వాసం మరింత బలపడింది. అదే స్ఫూర్తితో ఇంటర్, డిగ్రీల్లోనూ ప్రథమ శ్రేణిలో పాసయ్యాడు. అనంతరం డిగ్రీ, డీఎడ్ పూర్తి చేశాడు.
తరువాత బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ పట్టా పొందాడు. ఇన్నేళ్లలో ఏనాడూ ఆత్మన్యూనతకు గురికాలేదు వెంకన్న. సకలాంగుల మాదిరిగానే అన్ని పనులూ సునాయాసంగా చేయగలడు. పాలేరు రిజర్వాయర్లో ఈత కొడతాడు. క్రికెట్ ఆడతాడు. సైకిల్ తొక్కుతాడు. మిషన్ కుడతాడు. సెల్ఫోన్ ఆపరేట్ చేస్తాడు. బట్టలు ఉతుకుతాడు. చక్కని రైటింగ్తో నోట్స్ రాస్తాడు. ఉపాధి హామీ పనులూ చేస్తాడు. తనకు రూ.3 వేల ఆసరా పింఛన్ వస్తోందని, పారిశుధ్య కార్మికురాలైన తన తల్లి స్వల్ప వేతనంతో ఇల్లు గడుస్తోందని చెబుతున్నాడు వెంకన్న. టీచర్గానీ, లైబ్రేరియన్గానీ కావాలనేది తన కల అంటున్నాడు ఈ యువకుడు. ఇంతకుముందు మణుగూరు గురుకుల పాఠశాలలో లైబ్రేరియన్గా కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేసినప్పటికీ.. కొవిడ్ కారణంగా పోస్టు పోయిందని చెబుతున్నాడాయన.