మామిళ్లగూడెం, సెప్టెంబర్ 22: జిల్లాలో సంపూర్ణ వ్యాక్సినేషన్ సాధించిన గ్రామ పంచాయతీలను మిగతావి స్ఫూర్తిగా తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ కోరారు. ఖమ్మాన్ని కూడా అతి త్వరలోనే సంపూర్ణ వ్యాక్సినేషన్ జిల్లాగా నిలబెట్టాలన్నారు. 13 మండలాల్లోని 28 పంచాయతీల్లో బుధవారం నాటికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ సందర్భంగా ఆయా సర్పంచ్లు, ఏఎన్ఎంలు, కార్యదర్శులు, ఆశ కార్యకర్తల ను బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ సత్కరించి ప్రశంసాపత్రాలు అందించారు.
ఆయన మాట్లాడుతూ.. జిల్లాను వంద శాతం వ్యాక్సినేషన్ జిల్లాగా చేసేందుకు మిగతా పంచాయతీలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కల్లూరు మండలం చెన్నూరు, కిష్టయ్యబంజర, వీఎన్ తండా, తెలగారం, ముచ్చవరం, ఓబుల్రావు బంజర, యజ్ఞనారాయణపురం, కామేపల్లి మండలం రామకృష్ణాపురం, కూసుమంచి మండలం జక్కేపల్లి, మధిర మండం సైదెల్లిపురం, అల్లినాగారం, వెంకటాపురం, నిదానపురం, ముదిగొండ మండలం ఖానాపురం, మల్లారం, పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం, చౌడవరం, సింగరేణి మండలం మంగళితండా, కొమ్ముగూడెం, తల్లాడ మండలం అంబేడ్కర్నగర్, తిరుమలయాపాలెం మండలం ఏలువారిగూడెం, తాళ్లచెరువు, తిమ్మక్కపేట, జోగులపాడు, ఎర్రుపాలెం మండలం లక్ష్మీపురం, రఘునాథపాలెం మండలం ఎన్వీ బంజర, సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం, ఏన్కూర్ మండలం మేడేపల్లి గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని వివరించారు. అదనపు కలెక్టర్ స్నేహలత, జడ్పీ సీఈవో అప్పారావు, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ రాజేశ్, డీఐవో డాక్టర్ అలివేలు, డీపీవో ప్రభాకర్రావు, డాక్టర్ సైదులు తదితరులు పాల్గొన్నారు.