పర్ణశాల : మండల పరిధిలోని పెద్దనల్లబల్లి గ్రామంలోని మోడల్ పాఠశాలను భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ సోమవారం తనిఖీ చేశారు. తరగతులకు హాజరైన విద్యార్థులను, ఉపాధ్యాయు లను బోధనకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ సిబ్బంది పాఠశాలను శానిటైజింగ్ చేశారా లేదా అని సంబంధిత ఉపాధ్యాయులను ఆరా తీసారు. పాఠశాల చుట్టుపక్కల ఉన్న పారిశుధ్య పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 2016 నుంచి ఈ పాఠశాలను ఇంగ్లీష్ మీడియం మోడల్ స్కూల్గా మార్చడం జరిగిందని, ప్రస్తుతం 104 మంది విద్యార్ధులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నట్లు పీవోకు తెలిపారు.
పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు చదివిన ఇంగ్లీష్ మీడియం పిల్లలకు మండలంలో 6 నుంచి 10వ తరగతి వరకు పాఠశాలలు ఎక్కడా ఆశ్రమ పాఠశాలలు లేవని, దీనివల్ల తెలుగుమీడియం ఆశ్రమపాఠశాలలో చేరుతున్నారని, ఇంగ్లీష్ మీడియం చదివిన విద్యార్ధుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని పీవో దృష్టికి తెచ్చారు.
మండలంలో 6 నుంచి 10 తరగతులకు ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేస్తే వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయొచ్చన్నారు. దీనికి స్పందించిన పీవో పాఠశాల సమస్యలకు సంబంధించి నివేదిక తయారుచేసి ప్రతిపాదనలు పంపాలని ఐటీడీఏ డీడీ రమాదేవికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఏ నర్సింహారావు, అధ్యాపకులు ఎ.రామారావు, కె.వెంకటేశ్వర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.