అశ్వారావుపేట: కొండరెడ్ల అభివృధ్దికి భద్రాచలం ఐటీడీఏ కృషి చేస్తుందని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు అన్నారు. మండలంలోని కొత్తకన్నాయిగూడెం, గోగులపూడి, గుబ్బలమంగమ్మ ఆలయం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని డబుల్బెడ్ రూమ్ గృహలు, వాటర్ ప్లాంట్ను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరును పరిశీలించారు. పాఠశాల సమస్యలను గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి చిన్నారులకు అందించే పౌష్టికాహరం గురించి చిన్నారుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. గోగులపూడిలోని ప్రభుత్వం నిర్మించిన డబుల్బెడ్ రూం గృహలను, వాటర్ ప్లాంట్ను పరిశీలించారు. కొండరెడ్ల యువకులు మాట్లాడుతూ తాము గుబ్బలమంగమ్మ ఆలయం ఆవరణలో దుకాణాలు నిర్వహించుకుంటూ ఉపాధి పొందుతున్నామని,తమను ఆదుకొవాలని, సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని పీవో గౌతమ్ పోట్రుకు విజ్ఞప్తి చేశారు.
దీనికి స్పందించిన పీవో కొండరెడ్ల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో విద్యాధరరావు, కొండరెడ్ల ప్రత్యేక అధికారి సురేష్బాబు, ఆర్ఐ వెంకటేశ్వర్లు, వివిధ శాఖ అధికారులు, స్థానిక సర్పంచ్ గొంది లక్ష్మణరావు, కార్యదర్శి విద్యాసాగర్, ఎన్డీ జిల్లా నాయకులు కంగాల కల్లన్న, కొండరెడ్లులు , గిరిజనులు పాల్గొన్నారు.