అశ్వారావుపేట: కొండరెడ్ల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాదాన్యతనిస్తున్నట్లు ఐటీడీఏ పీవో గౌతమ్ స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు బలవర్దకమైన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో గిరి పోషణ పథకం కింద జోవర్ మీల్స్, మల్టీ గ్రెయిన్ మీల్స్, మల్టీ గ్రీన్ స్వీట్ మీల్స్ను ప్రత్యేకంగా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. శుక్రవారం మండలంలోని పలు కొండరెడ్ల గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా రెడ్డిగూడెం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారంపై తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
అక్కడ ఆహార పదార్ధాలను తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రం నిర్వాహణపై తల్లిదండ్రులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలో విద్యాబోధన, పౌష్టికాహారం ఎలా ఉందో పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజు, సురేష్ బాబు, తహశిల్థార్ చల్లా ప్రసాద్, ఐటీడీఏ డీఈ రాజు, సీడీపీవో రోజారాణి, సూపర్వైజర్లు విజయలక్ష్మీ, నాదేళ్ళ సౌజన్య, సర్పంచ్ మహేశ్వర్రెడ్డి, తదితరులు ఉన్నారు.