ములకలపల్లి: ములకలపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో బంగారు పతకాలు సాధించారు. 9 బంగారు పతకాలను సాధించి కళాశాల ప్రతిష్టను మరింతగా పెంచారు. గురుకులం ప్రిన్సిపాల్ సునీత గురువారం క్రీడల్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థినులను పరిచయం చేశారు. గోవాలోని ఏంజిల్ కాలేజీ గ్రౌండ్స్ మార్గాన్లో 5వ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని 9 మంది విద్యార్ధినులు 9 బంగారు పతకాలను సాధించడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు.
ములకలపల్లిలో క్రీడల్లో గెలుపొందిన విద్యార్థినులతో ప్రిన్సిపాల్ ర్యాలీ నిర్వహించారు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి క్రీడల్లో కబడ్డీ విభాగంలో నాగేశ్వరి(బైపీసీ ద్వితీయ సంవత్సరం), సాహిత్య(బైపీసీ మొదటి సంవత్సరం), సీతామహాలక్ష్మి( బైపీసీ మొదటి సంవత్సరం), సృజన(10వ తరగతి), మైశ్రి(8వ తరగతి), అథ్లెటిక్స్ విభాగంలో ప్రశాంతి(బైపీసీ మొదటి సంవత్సరం), అర్చన (ఎంపీసీ) 400 మీటర్లు, పూజిత(10వ తరగతి)800 మీటర్లు, ప్రియాంక(10వ తరగతి) 100మీటర్లు, దుర్గాభవానీలు అత్యంత ప్రతిభకనబర్చిన వారిలో ఉన్నట్లు తెలిపారు.