పర్ణశాల: దుమ్ముగూడెం మండల పరిథిలో ఉన్న13చెరువులకు తాలిపేరు నీరు విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ ఏఈ రాజ్ సుహాస్ తెలిపారు. శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాలిపేరు నీరు 12 తూముల ద్వారా 13చెరువులకు నీరు విడుదల చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తాలిపేరు కాలువ ద్వారా ప్రతి ఏటా13వేల ఎకరాల్లో పంటను పండిస్తున్నారని, ఈ ఏడాది వర్షాలు తక్కువ స్థాయిలో పడటంతో చాలాచోట్ల చెరువుల్లో నీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.
ఛత్తీస్ఘడ్లో కురుస్తున్న వర్షాలకు తాలిపేరులో నీరు చేరుతుండటంతో తాలిపేరు కాలువల కింద ఉన్న రైతుల పోలాలతో పాటు మండలంలో ఉన్న 13చెరువులకు నీరు పుష్కలంగా అందిస్తున్నామని తెలిపారు. దుమ్ముగూడెం మండలంలో తాలిపేరు ప్రధాన కాలువ ద్వారా 33కిలోమీటర్ల పొడవునా పోలాలకు నీరు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చెరువుల్లోకి తాలిపేరు నీరు చేరడంతో మత్స్య సంపద కూడా వృద్ధి చెందుతుందన్నారు. నీరు చేరడంతో 2వేల ఎకరాల్లో పంటను సాగుచేస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.