కొత్తగూడెం: ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ డీఆర్వోను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించిన ధరఖాస్తులను స్వీకరించి పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు చెప్పారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు మాత్రమే హాజరుకావాలని, తన అనుమతి లేకుండా ఆలస్యంగా వచ్చినా, గైర్హాజరైనా ఉపేక్షించనని హెచ్చరించారు. ముందస్తు తన అనుమతి లేకుండా గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణతో తనకు అందజేయాలని డీఆర్వోకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో అశోకచక్రవర్తి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.