భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకోరూపంలో భక్తులకు దర్శనమిస్తూ, విశేష పూజలందుకుంటున్నారు. మంగళవారం లక్ష్మీ తాయారమ్మ వారు ఐశ్వర్యలక్ష్మీగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో, నదీ జలాలతో అర్చకులు అభిషేకం చేశారు.
చిత్రకూట మండపంలో వేద పండితులు శ్రీరామాయణ పారాయణ చేశారు. దసరా సమీపిస్తుండటంతో అధిక సంఖ్యలో మహిళా భక్తులు అమ్మవారి సామూహిక కుంకుమార్చనలో పాల్గొని, పూజలు చేశారు. బుధవారం అమ్మవారు వీరలక్ష్మిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.